Bigg Boss 5 Telugu Buzz: ప్రశ్నలతో లహరిని ఆడేసుకున్న అరియానా!

27 Sep, 2021 18:49 IST|Sakshi

19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. తొలివారం సరయు, రెండోవారం ఉమాదేవి, థర్డ్‌ వీక్‌లో లహరి షారి(అమ్ము) హౌస్‌ నుంచి బయటకొచ్చేశాడు. తాజాగా ఎలిమినేట్‌ అయిన లహరి బిగ్‌బాస్‌ బజ్‌లో అరియానా గ్లోరీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నిజానికి ఇది ఇంటర్వ్యూలా కాకుండా వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి ఫైట్‌ జరిగినట్లే కనిపించింది. అరియానా ఏకధాటి ప్రశ్నలతో లహరికి ముచ్చెమటలు పట్టించింది. జెస్సీ ఏం చేయకుండానే కెప్టెన్‌ అయ్యారంటారా? అని సూటిగా ప్రశ్నించడంతో లహరి నీళ్లు నమిలింది.

కాజల్‌ అస్తమానం ఏదో ఒక కంటెంట్‌ ఇవ్వడానికే ప్రయత్నిస్తుందని అమ్ము ఆరోపించగా.. కంటెంట్‌ కోసం మీరు కాజల్‌ దగ్గరకు వెళ్లినట్లు అనిపించిందని కౌంటరిచ్చింది అరియానా. అలా అనిపించిందీ అంటే మీరు సరిగా షో చూడలేదని రివర్స్‌ పంచ్‌ ఇచ్చింది లేడీ అర్జున్‌రెడ్డి. అలాగే బిగ్‌బాస్‌ షోలో ఫ్యాన్‌బేస్‌ అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అని లహరి అభిప్రాయపడగా.. 'ఆడియన్స్‌ ఓటేయాలంటే ముందు మనం గేమ్‌ ఆడాలి' అని ఆమె పెద్దగా పర్ఫామ్‌ చేయలేదని చెప్పకనే చెప్పింది బోల్డ్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్‌ బజ్‌ ప్రోమో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

'వాళ్లు ఓటేయాలంటే ముందు మనం గేమ్‌ ఆడాలి' అని అరియానా ఇచ్చిన లాస్ట్‌ పంచ్‌ మాత్రం అదిరిపోయిందంటున్నారు అభిమానులు. మూడో ఇంటర్వ్యూకే ఆమె హోస్టింగ్‌ చాలా మెరుగుపడిందంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె ఇంటర్వ్యూ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యానన్న బాధలో ఉన్న లహరిని టార్గెట్‌ చేస్తూ, తన ప్రశ్నలతో మానసికంగా మరింత బాధపెట్టిందని అంటున్నారు. బిగ్‌బాస్‌ షో నుంచి వెళ్లిపోయి ఏడాది దాటుతున్నా బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా మారి మరోసారి కంటెంట్‌ ఇవ్వాలని ట్రై చేస్తోందని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు