Bigg Boss 5 Telugu: ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌

6 Oct, 2021 23:45 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 32: ​బిగ్‌బాస్‌ ప్రవేశపెట్టిన 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్‌ రసవత్తరంగా సాగుతోంది. మొదటి లెవల్‌లో ఇచ్చిన కుస్తీపోటీలో విశ్వ మానస్‌ను ఓడించి పైచేయి సాధించాడు. తర్వాత తనతో పోటీలోకి దిగిన యానీ మాస్టర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు జెస్సీ. అనంతరం ప్రియాంక సింగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది శ్వేత. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్‌ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. దీంతో అతడికి 150 నాణాలు వచ్చాయి. అయితే ఖజానాలో నుంచి నాణాలు దొంగిలిస్తున్నారంటూ విశ్వ చిర్రుబుర్రులాడాడు. కానీ విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది.

సైగలతో సంభాషించుకున్న శ్రీరామ్‌, హమీదా
ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్‌ నాణాలు పంచుకున్నారు మరోపక్క హమీదా శ్రీరామ్‌ను తన కౌగిలిలో బంధించింది. తర్వాత వీళ్లిద్దరూ ఎప్పటిలాగే సైగలతో సంభాషించుకుని గుడ్‌నైట్‌ చెప్పుకున్నారు. అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు 'రాజుగారి గోడ' అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్‌మేట్స్‌ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్‌ బజర్‌ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క!

శ్రీరామ్‌ గాలి తీసేశారు..: షణ్ను
దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్‌, జెస్సీ బరిలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో చిర్రెత్తిపోయిన శ్రీరామ్‌.. ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను.. ఇప్పటిదాకా స్ట్రాంగ్‌ అనుకున్న శ్రీరామ్‌ గాలి తీసేశారంటూ సెటైర్‌ వేశాడు.

ఆ అవార్డు ఉంటే అది కాజల్‌కే చెల్లుతుంది: యానీ
ఇంతలో కాజల్‌ నాణాలు దొంగతనం చేయడం చూశాడు రవి. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ బుకాయించింది కాజల్‌. అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్‌ యవ్వారంతో ఇరకాటంలో పడ్డాడు రవి.. ఆమెతో పెట్టుకుంటే పనులు అయినట్లేనని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్‌.. నిజానికి ప్రోవోక్‌ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలంది. ఇంతలో సిరి.. సడన్‌గా రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి షిఫ్ట్‌ అయింది.

మళ్లీ గెలిచిన సన్నీ..
అనంతరం బిగ్‌బాస్‌.. 'లాక్కో లాక్కో తాడు' టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఈ టాస్క్‌లో మరోసారి యువరాజు సన్నీ గెలుపు సాధించడంతో అతడి ప్రజానీకం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రేపటి ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో భావోద్వేగానికి లోనవగా హౌస్‌ మొత్తం కూడా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు