Bigg Boss 5 Telugu: ఇద్దరూ మాయం, డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌!

24 Oct, 2021 18:29 IST|Sakshi

Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: సండే అనగానే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో టెన్షన్‌ మొదలవుతుంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్‌లో ఉన్నవారు ఎక్కడ ఎలిమినేట్‌ అయిపోతామోనని భయంతో వణికిపోతుంటారు. ఈ వారం కాజ‌ల్‌, సిరి, ర‌వి, యానీ, ప్రియ‌, శ్రీరామ్‌, జెస్సీ, లోబో నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్‌, కాజల్‌ను నాగ్‌ శనివారం ఎపిసోడ్‌లో సేవ్‌ చేశారు. సిరి, రవి, యానీ, ప్రియ, జెస్సీ, లోబో ఇంకా డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో యానీ, ప్రియ తప్ప అందరూ సేవ్‌ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అవనున్నట్లు కనిపిస్తోంది. వీళ్లిద్దరినీ హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్‌. అనంతరం వారిని గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, యానీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు.

కాసేపటికి బాక్సులపై ఉన్న లైట్స్‌ ఆఫ్‌ అవగా ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని తెరిచి చూశారు. కానీ వాటిలో ఉన్న ప్రియ, యానీ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో షాకైన ఇంటిసభ్యులు ఎవరూ లేరేంటని అయోమయానికి లోనయ్యారు. వారిని మరింత టెన్షన్‌కు గురి చేస్తూ నాగ్‌.. ఇద్దరూ స్టేజీ మీదకు వస్తారేమో అంటూ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉందన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పటికే లీకువీరులు ప్రియ ఎలిమినేట్‌ అయిందని సోషల్‌ మీడియాలో దండోరా వేసేశారు కాబట్టి నాగ్‌ మాటలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. 'డబుల్‌ ఎలిమినేషన్‌ అనగానే నమ్మేస్తాం అనుకుంటున్నారా? అంత సీన్‌ లేదు, ప్రియ తట్టాబుట్టా సర్దేసుకుందని మాకు తెలిసిపోయిందిలే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు