Bigg Boss Telugu 5: ఉమాదేవి అవుట్‌, కన్నీళ్లు ఆపుకోలేకపోయిన లోబో

19 Sep, 2021 22:59 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 15: సండేను ఫండేగా మార్చేందుకు రెడీ అయిన నాగార్జున ఆడవాళ్లు, మగవాళ్లకు డ్యాన్స్‌ కాంపిటీషన్‌ నిర్వహించాడు. అమ్మాయిలు ఎంచుకునే కప్పులో ఎవరి పేరుంటుందో వాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ క్రమంలో ఉమాదేవి - షణ్ముఖ్‌, లహరి - జెస్సీ, ప్రియ- యాంకర్‌ రవి, హమీదా - శ్రీరామ్‌, ప్రియాంక - మానస్‌, యానీ మాస్టర్‌ - విశ్వ, సిరి - నటరాజ్‌ మాస్టర్‌ పోటీపడుతూ డ్యాన్స్‌ చేశారు. ఈ జంటలలో ఎక్కువగా అబ్బాయిలే ఎక్కువ స్కోర్‌ చేశారు. ఓవరాల్‌గా అబ్బాయిలకు ఎక్కువ పాయింట్లు వచ్చినప్పటికీ బిగ్‌బాస్‌ మాత్రం అమ్మాయిలు గెలిచినట్లు ప్రకటించి మేల్‌ కంటెస్టెంట్లకు షాకిచ్చాడు. తర్వాత నాగ్‌ కాజల్‌ సేఫ్‌ అయినట్లు వెల్లడించాడు.

హౌస్‌మేట్స్‌కు మటన్‌ పంపిస్తానన్న నాగ్‌
ఇక కాజల్‌ తనకు మటన్‌ బిర్యానీ తినాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. దీంతో నాగ్‌ అందులో ఏముంది? వండుకుని తినంటూ పంచ్‌ ఇచ్చాడు. కానీ అంతలోనే హౌస్‌మేట్స్‌ అందరికీ మటన్‌ పంపిస్తానని కాకపోతే దాన్ని కాజల్‌ మాత్రమే వండాలని ట్విస్టిచ్చాడు. దీంతో కాజల్‌ చచ్చాన్రా దేవుడా అనుకున్నా మిగతా హౌస్‌మేట్స్‌ మాత్రం ఎలాగైనా ఆమెతో వండించి తీరతాం అని మనసులోనే ధృడంగా అనుకుని ఉంటారు.

రాత్రిళ్లు నిద్రపోకుండా తిరిగే దెయ్యం సిరి
అనంతరం నాగ్‌.. ఇంటిసభ్యులతో 'ఇంట్లో ఉన్న దెయ్యం' ఆట ఆడించాడు. మొదటగా ప్రియ.. రాత్రి సరిగా నిద్రపోకుండా దెయ్యంలా అటూ ఇటూ తిరుగుతుందని సిరికి దెయ్యం స్టిక్కర్‌ అతికించింది. మానస్‌.. శ్రీరామ్‌ తీసుకునే కొన్ని నిర్ణయాలు తనకు ఇమ్మేచ్యూర్‌డ్‌గా అనిపించాయంటూ అతడికి స్టిక్కర్‌ అతికించాడు. లహరి.. ఏదైనా గట్టిగా అరుస్తూ చెప్తుందని ఉమాదేవిని దెయ్యంతో పోల్చింది. హమీదా.. యానీ మాస్టర్‌ను దెయ్యం అనేసింది. శ్రీరామ్‌.. ఓటమిని తీసుకోలేడంటూ మానస్‌ను దెయ్యంగా అభిప్రాయపడ్డాడు.

అందరి మీదా పగ, కానీ దెయ్యం మాత్రం ఆవిడే
సన్నీ.. తనకు అందరి మీదా పగ ఉందంటూనే చివరగా ప్రియాంక సింగ్‌ నుదుటన స్టిక్కర్‌ అతికించాడు. విశ్వ.. కాజల్‌ దెయ్యంలా తన వెనకాల పడుతుందన్నాడు. ప్రియాంక.. లేట్‌గా పడుకునే లోబోను దెయ్యమని పేర్కొంది. జెస్సీ, శ్వేత, ఉమాదేవి, లోబో.. సిరిని; యానీ మాస్టర్‌.. హమీదాను; కాజల్‌, నటరాజ్‌ మాస్టర్‌.. విశ్వను; సిరి.. ఉమాదేవిని దెయ్యంగా అభివర్ణించారు. సన్నీ విషయంలో తప్పు చేశానంటూ షణ్ముఖ్‌ తనను తానే దెయ్యమని చెప్పుకున్నాడు. అది కుదరదని నాగ్‌ తెగేసి చెప్పడంతో సిరిని దెయ్యంగా అభివర్ణించాడు. తర్వాత ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌ సేఫ్‌ అయ్యాడు. ఉమాదేవి ఎలిమినేట్‌ అయింది. అయితే ఇక్కడిదాకా వచ్చాను, ఏదో ఒకటి సాధించే వెళ్లాలి అంటూ నటరాజ్‌ మాస్టర్‌ కిందపడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇక ఉమ వెళుతుంటే లోబో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం రవి పుట్టిన రోజును పురస్కరించుకుని తన భార్య పంపిన లెటర్‌ చదివి ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే తనకు గిఫ్ట్‌ ఇచ్చిన ఉంగరాన్ని ముద్దాడాడు.

మరిన్ని వార్తలు