Adipurush: కీలక పాత్రలో బిగ్‌బాస్‌ విన్నర్‌!

16 May, 2021 08:08 IST|Sakshi

బాహుబలితో ప్రభాస్‌ పాన్‌ ఇండియా హీరోగా మారిపోతే తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌తో ఓం రౌత్‌ క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా నటీనటులను ఎంపిక చేసుకుంటోంది ఆదిపురుష్‌ టీమ్‌. ఇప్పటికే సీతగా కృతీసన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేయగా తాజాగా మరో ముఖ్య పాత్ర కోసం బిగ్‌బాస్‌ విన్నర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లాను మేఘనాథ్‌ పాత్రలో నటించాల్సిందిగా దర్శకులు కోరినట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతమంచి ఆఫర్‌ను సిద్దార్థ్‌ వదులుకునే అవకాశమే లేదు. పైగా పాన్‌ ఇండియా సినిమాలో నటించడమంటే దశ తిరిగినట్లే లెక్క. మరి ప్రభాస్‌ ఆదిపురుష్‌లో సిద్దార్థ్‌ ఉంటాడా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.

మరోవైపు ఆదిపురుష్‌ రెండో షెడ్యూల్‌ ఇటీవలే ముంబైలో ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్న ఆదిపురుష్‌ టీం తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్‌ చేసింది. ఈ షెడ్యూల్‌ 45 రోజులకు పైగా కొనసాగుతుందని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: Kriti Sanon: అక్కడే నా సంతోషం!

మరిన్ని వార్తలు