Tejasswi Prakash: బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై స్పందించిన బిగ్‌బాస్‌ విన్నర్‌

10 Mar, 2022 21:32 IST|Sakshi

సెలబ్రిటీల కోసం పడిచచ్చేవాళ్లే కాదు వారిని చులకనగా చూసేవాళ్లూ చాలామందే ఉన్నారు. సన్నగా ఉంటే బక్కచిక్కిపోయిందని, బొద్దుగా ఉంటే లావుగా ఉందని, కురచగా ఉంటే ఎత్తూపొడుగు లేదని, హైట్‌ ఎక్కువ ఉంటే అన్ని పాత్రలకు సెట్టవ్వదని ఇలా నానామాటలు అంటుంటారు. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ విన్నర్‌, నాగిని సీరియల్‌ నటి తేజస్వి ప్రకాశ్‌ కూడా ఇలాంటి బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌ బాధితురాలే.

దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'బరువు ఎక్కువగా ఉన్నవారినే కాదు, బక్కపలుచగా ఉన్నవారిని కూడా బాడీ షేమింగ్‌ చేస్తారు. నేనూ అలాంటి నెగెటివ్‌ కామెంట్లను ఫేస్‌ చేశాను. కొన్నిసార్లు నాకు కూడా బాడీ పర్ఫెక్ట్‌గా కనిపించేందుకు సర్జరీ చేసుకుంటే బాగుండనిపించింది. చాలామంది అదే పని చేశారు. కానీ ఇతరుల కామెంట్లతో నేనెందుకు మారాలని అనుకున్నాను. దేవుడు నన్ను ఎలా పుట్టించాడో అలాగే ఉండాలనుకున్నాను. నా బాయ్‌ఫ్రెండ్‌ కూడా నేను లడ్డూలా ఉంటేనే ఇష్టపడతాడు. కాబట్టి నన్ను నేను మార్చుకోనక్కర్లేదు' అని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో పనితనాన్ని గురించి మాట్లాడుతూ.. 'ఒకసారైతే నాకు హీరో కన్నా ఎక్కువ డబ్బులిచ్చారు. ఎందుకంటే వారు ఆ సమయంలో నేనే యాక్ట్‌ చేయాలని కోరుకున్నారు, అందుకే ఎక్కువ ముట్టజెప్పారు. దీన్నిబట్టి నేను చెప్పొచ్చేదేంటంటే మీ పనిలోని నైపుణ్యాన్ని బట్టే మీకు డబ్బులు చెల్లిస్తారు' అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాశ్‌.

మరిన్ని వార్తలు