బాలీవుడ్‌ నటి భూమి పడ్నేకర్‌కు కరోనా..

5 Apr, 2021 12:19 IST|Sakshi

ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడాలు లేకుండా రోజురోజుకీ లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో సైతం కరోనా గడగడలాడిస్తోంది. బీటౌన్‌ సెలబ్రిటీలందరూ వరుసపెట్టి మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఆలియాభట్‌, అక్షయ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా మరో ఇద్దరు కోవిడ్‌ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. ఆవిరి పట్టడం, విటమిన్‌ సీ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాను. నాతో కాంటాక్ట్‌ అయిన వారందరూ టెస్ట్‌ చేయించుకోండి. దయచేసి కరోనాను నిర్లక్ష్యం చేయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకొండి. మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి’ అని నటి భూమి సూచించారు.

కాగా టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్‌లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్‌ కుమార్‌ సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్‌, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా భూమి కూడా కరోనా బారిన పడటంతో బీటౌన్‌లో కంగారు మొదలైంది.

చదవండి: కరోనా పాజిటివ్‌: ఆస్పత్రిలో చేరిన అక్షయ్‌

మరిన్ని వార్తలు