ఇకపై నేను గే మ్యాన్‌ కాదు: డిజైనర్‌

7 Jan, 2021 13:22 IST|Sakshi

మహిళగా మారిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వప్నిల్‌ షిండే తాను మహిళగా మారినట్లు ప్రకటించారు. తన పేరును సైషా షిండేగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘నేను గే కాదు.. ట్రాన్స్‌ వుమన్‌’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. బీ- టౌన్‌ సెలబ్రిటీలు దీపికా పదుకొనె, కరీనా కపూర్‌, శ్రద్ధ కపూర్‌, సన్నీ లియోన్‌, మాధురీ దీక్షిత్‌, ప్రియాంక చోప్రా, భూమి ఫడ్నేకర్‌, హీనా ఖాన్‌ తదితరులకు స్వప్నిల్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. సరికొత్త ఫ్యాషన్‌ డిజైన్లతో స్టార్ల మనసు దోచుకున్న స్వప్నిల్‌ గే అని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆయన.. ‘‘మనం ఎక్కడ ఉన్నామన్న అంశంతో సంబంధం లేకుండా బాల్యం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకువస్తూనే ఉంటాయి. నా గతం నేను ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గుర్తుచేస్తుంది. ఏకాంతంలో గడిపేలా నాపై ఒత్తిడి తెచ్చిన పరిస్థితులు గుర్తుకువస్తాయి. స్కూళ్లో, కాలేజీలో అబ్బాయిలంతా నన్ను కాస్త తేడాగా చూసేవారు. 

ఆ విషయం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నేను జీవిస్తున్న జీవితం నాది కాదు అనే భావన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. సమాజంలో ఉన్న హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజూ ప్రతిక్షణం మానసిక ఆందోళనకు గురయ్యాను. 20 ఏళ్ల వయస్సులో నిఫ్ట్‌లో చేరిన సమయంలో నా గురించి నాకు తెలిసిన నిజాన్ని నేను అంగీకరించాను. అప్పుడే వికసించాను. అబ్బాయిల వైపు ఆకర్షితుడిని అవుతున్న కారణంగా గే అనుకున్నాను. కానీ ఆరేళ్ల క్రితమే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను గే మాన్‌ కాదు.. ట్రాన్స్‌ వుమన్‌ను.. నా పేరు సైషా.. అంటే అర్థవంతమైన జీవితం అని అర్థం’’ అని సుదీర్ఘ పోస్టు ద్వారా తన మనోభావాలు వెల్లడించారు.(చదవండి: ‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’)

A post shared by S A I S H A S H I N D E (@officialswapnilshinde)

మరిన్ని వార్తలు