బాలీవుడ్‌లో విషాదం: దృశ్యం దర్శకుడు కన్నుమూత

17 Aug, 2020 20:51 IST|Sakshi

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు నిశికాంత్‌ కామత్(50)‌ కన్నుమూశారు. కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నిశికాంత్ మృతిని ఏఐజీ హాస్పిటల్స్ ధృవీకరించాయి. జ్వరం, ఆయాసంతో జులై 31న నిశికాంత్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన గత రెండేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, దీంతో దానికి అనుగుణంగా వైద్యం మొదలుపెట్టామని పేర్కొంది. (నిషికాంత్‌పై ట్వీట్‌: రేణు సహానీ వివరణ)

ఆ తర్వాత తమ వైద్యంతో కామత్ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించిందని, కానీ.. ఆ తరవాత మళ్లీ ఆయన పరిస్థితి విషమించిందని ఏఐజీ హాస్పిటల్స్ పేర్కొంది. ఆయన్ని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని.. అయినప్పటికీ రోజురోజుకి ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని వెల్లడించింది. నిన్నటి నుంచి ఆయన శ్వాసకోశ పనిచేయడం మానేసిందని, అలాగే రక్తపోటు కూడా బాగా తగ్గిపోయిందని తెలిపింది. ఆయన్ని కాపాడటానికి తాము అన్నివిధాలుగా ప్రయత్నించామని, అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం నిశికాంత్ కన్నుమూసినట్లు ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. (ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు)

కాగా నిశికాంత్‌ మరణంపై నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ స్పందించారు. ‘నేను నిన్ను మిస్ అవుతాను మై ఫ్రెండ్‌. నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’. అంటూ ట్వీట్‌ చేశారు. ఇక నిషికాంత్ కామత్ 2004 లో వచ్చిన ‘హవా అనీ డే’ అనే చిత్రంతో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం డైరెక్షన్‌పై ఉన్న ఆసక్తితో  దర్శకుడిగా అవతారమెత్తారు. అతను క్రమంగా దర్శకత్వం వైపు వెళ్ళాడు. హిందీలో దృశ్యం, మదారి, ముంబై మేరీ జాన్ లాంటి సినిమాలతో నిశికాంత్‌ మంచి పేరు సంపాదించాడు. 

మరిన్ని వార్తలు