Disha Patani : దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ

26 May, 2023 07:40 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ, దిశా పటానికి కోలీవుడ్‌లో మరో చాన్స్‌ తలుపు తట్టిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్‌లో సత్తాచాటిన ఈమె ఇప్పటికే తమిళంలో నటుడు సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సమకాలీన కథలో చారిత్రక అంశాలను జోడించి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఈ చిత్రం విడుదలకు ముందే నటి దిశా పటానికి మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. కమలహాసన్‌ తన రాజ్‌ కుమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించే చిత్రం చోటుచేసుకుంది. దీన్ని కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌ చిత్రం ఫేమ్‌ దేసింగు పేరియసామి తెరకెక్కించనున్నారు.

వచ్చేనెల ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కినున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో శింబుతో జతకట్టే నటి ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది భారీ బడ్జెట్లో రూపొందనున్న పాన్‌ ఇండియా కథాచిత్రం కావడంతో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనేను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది.

అయితే ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేయడంతో చిత్ర వర్గాలు వేరే నటిని ఎంపిక చేసే పనిలో పడ్డట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు