మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విఙ్ఞ‌ప్తి

13 Oct, 2020 11:40 IST|Sakshi

ఢిల్లీ : వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తించాయంటూ రిప‌బ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థ‌లపై ప‌రువు న‌ష్టం దావా వేస్తూ ప్ర‌ముఖ  బాలీవుడ్ నిర్మాత‌లు సోమ‌వారం  ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.  చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా ఈ మీడియా సంస్థలు బాధ్య‌తా ర‌హిత‌మైన‌, అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేశాయంటూ ఆరోపించాయి. ఈ మేర‌కు బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్‌, 34 ప్ర‌ముఖ  నిర్మాణ సంస్థలు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. రిప‌బ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి,  రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్  గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ పేర్ల‌ను పిటిష‌న్‌లో చేర్చారు. (పొరుగింటామెను అరెస్ట్‌ చేయండి: రియా)

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలోనూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌కుండా వీరిని నివారించాలంటూ నిర్మాణ సంస్థ‌లు పేర్కొన్నాయి.  బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై  పోలీసులపై ఈ  న్యూస్‌ చానల్స్  తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మలో డ్ర‌గ్స్ వాడ‌కం చాలా స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, ఇది ఓ చెత్త ప‌రిశ్ర‌మ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. (ముంబైలో టీఆర్‌పీ స్కామ్‌)

>
మరిన్ని వార్తలు