పోలీసులుకు బెదిరింపు కాల్స్‌ చేసిన ఆకతాయి

14 Oct, 2020 10:46 IST|Sakshi

చెన్నై: గత రాత్రి ఓ అపరిచిత వ్యక్తి చేసిన ఫోన్‌ చెన్నై పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. చివరకు అది ఎవరో ఆకతాయి చేసిన పనిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు కాల్‌ చేసి చెన్నైలోని ధనుష్ అభిరామపురం ఇంట్లో, విరుగంబక్కంలోని విజయకాంత్ ఇంట్లో బాంబులు ఉన్నట్లు బెదిరించాడు. దాంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన పోలీసులు వెంటనే హీరోల ఇళ్లకు చేరుకున్నారు. బాంబులను నిర్వీర్యం చేసే బృందం హీరోల ఇంటి పరిసరాలు మొత్తం జల్లెడ పట్టారు. గంటల కొలది హై టెన్షన్‌ అక్కడ చోటు చేసుకుంది. అణువణువూ గాలించిన పోలీసులు, అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధం లేదని నిర్ధారణకు వచ్చారు. దీనితో ఇది ఎవరో ఆకతాయి పని కావచ్చని పోలీసులు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: హీరో ధనుష్‌కి మధురై హైకోర్టు షాక్‌)

అయితే ఈ మధ్య కాలంలో చెన్నైలో ప్రముఖ హీరోలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. కొన్ని నెలల క్రితం రజనీ కాంత్ ఇంటిలో బాంబ్ ఉందని ఒకరు బెదిరించారు. దాంతో పోలీసులు రజనీ ఇల్లు జల్లెడ పట్టి చివరకు అది ఒక ఫేక్ కాల్ అని గుర్తించారు. ఆ ఫోన్ చేసిన బాలుడు మతిస్థిమితం లేనివాడని తెలుసుకొని, అతన్ని వదిలేశారు. అలానే హీరో అజిత్, విజయ్ నివాసాలలో బాంబులు పెట్టినట్లు ఫేక్ కాల్స్ రావడం జరిగింది. ప్రముఖులు కావడంతో పాటు విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులు ప్రతిసారి పరుగులు పెట్టాల్సివస్తుంది. ఆకతాయిలు మాత్రం తరచుగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ధనుష్ ఇంటిలో బాంబ్ లేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు