బ్రాడ్​పిట్​కి అనుకూలంగా తీర్పు.. ఇక విడాకులే!

27 May, 2021 12:23 IST|Sakshi

ఐదేళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటంలో హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి ఓడింది. బిడ్డల సంరక్షణ కోసం నటుడు, భర్త బ్రాడ్​పిట్​కి వ్యతిరేకంగా ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో బ్రాడ్​పిట్​కి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, 2016లో వ్యక్తిగత కారణాలతో భర్త బ్రాడ్ నుంచి విడాకులు కోరుతూ.. ఏంజెలీనా జోలి విడాకులకు కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటి నుంచి కేవలం పిల్లల సంరక్షణ గురించిన పిటిషన్​తోనే కోర్టు వ్యవహారం నడుస్తోంది. దీంతో వీళ్లకు ఇప్పటి వరకు విడాకులు మంజూరు కాలేదు. ఇక కోర్టులో వాదప్రతివాదనల కోసం జాన్​ అవుడర్​కిరిక్​ అనే ప్రైవేట్ జడ్జ్​ను నియమించారు. 2014 వీళ్ల పెళ్లికి అధికారిక ముద్ర వేసింది కూడా జడ్జినే. ఈ జంటకు ఆరుగురు పిల్లలు. ఐదుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్​పిట్(57)​తో కలిసి పంచుకోవాలని ఎంజెలీనా జోలిని జడ్జి ఆదేశించాడు. అయితే పెద్దవాడైన మాడోక్స్​ కస్టడీ గురించి ఎటూ తేల్చలేదు. ఈ తీర్పుపై జోలి మండిపడింది. జడ్జి, బ్రాడ్​పిట్​కు అమ్ముడుపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పుపై ఎంజెలీనా జోలి(45) రీ పిటిషన్​ వెళ్లాలనుకుంటోంది.

కొడుకు వయసున్న అమ్మాయితో.. : చదవండి

ఇక 2005లో మిస్టర్​ అండ్​ మిస్సెస్​ సినిమా ద్వారా దగ్గరైన ఈ జంట.. తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్​ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే విడాకుల తర్వాత పిల్లల బాధ్యత గురించే ముందుగా పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ క్లియర్​ కావడంతో విడాకుల పిటిషన్​కి లైన్​ క్లియర్​ అయ్యే అవకాశం ఉంది. కాగా, వ్యక్తిగత సమస్యల వల్లే బ్రాడ్​ పిట్​తో తాను విడిపోతున్నట్లు ఎంజెలీనా ప్రకటించినా.. బ్రాడ్​పిట్​ ఎఫైర్లే​ అందుకు కారణాలని హాలీవుడ్​ కథనాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు