Mammootty: భయపెట్టేందుకు రెడీ అయిన మెగాస్టార్‌.. తనవంతు పూర్తి..

18 Sep, 2023 10:38 IST|Sakshi

మలయాళ మెగా స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం భ్రమయుగం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థల అధినేతలు చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ కలిసి నిర్మిస్తున్నారు. మమ్ముట్టి చిత్రం అనగానే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తుంటారు.

అలాంటి కథాంశంతోనే రాహుల్‌ సదాశివన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్డా రైజ్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత ఆగస్టు 17వ తేదీన కేరళ సమీపంలోని ఒట్టపాలెం ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీన మమ్ముట్టి పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు నిర్మాతలు తెలిపారు.

అంటే సరిగ్గా నెల రోజుల్లో మమ్ముట్టి భ్రమయుగం చిత్ర షూటింగ్‌ పూర్తి చేశారన్నమాట. అదేవిధంగా ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేసి 2024 ప్రథమార్థంలో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

చదవండి: సూర్య బాలీవుడ్ ఎంట్రీ.. ఆ పాత్రకు సెట్టయ్యేనా?

మరిన్ని వార్తలు