Britney Spears: ఆ రహస్యాలు చెప్పడం కోసం సింగర్‌కి రూ.112 కోట్లు

23 Feb, 2022 12:58 IST|Sakshi

ప్రముఖ పాప్‌ సింగర్‌  బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ పుస్తక ప్రచురణ సంస్థ భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు పుస్తక రూపంలో వెలుగులోకి తీసుకురావడం కోసం ఆమెకు 15 మిలియన్‌ డాలర్లు(ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు) అప్పజెప్పేందుకు అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్‌ ముందుకు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో ఆమెకు ఇవ్వడానికి కారణం ఏంటంటే... తన జీవితంలో చోటు చేసుకున్న కన్సర్వేటర్‌షిప్ గురించి అంతా బయట పెట్టేందుకు బ్రిట్నీ అంగీకరించడమే. ఈ పబ్లిషింగ్‌ హౌస్‌ విడుదల చేయబోయే బుక్‌లో బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్‌  సంరక్షణలో  తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలుంటాయట. 

 2008లో బ్రిట్నీ స్పియ‌ర్స్ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను ఆమె తండ్రి జేమిని స్పియర్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్‌ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని  గతంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన లాస్‌ ఎంజిల్స్‌ కోర్టు.. గత ఏడాది నవంబర్‌లో తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చింది. బ్రిట్నీ జీవితంపై, ఆస్తిపాస్తుల ఆమె తండ్రికి ఎలాంటి నియంత్రణ ఉండబోదని కోర్టు వెల్లడించింది. ఫలితంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ ఏళ్ల కిందట న్యాయస్థానం విధించిన కన్సర్వేటర్‌షిప్ ఎట్టకేలకు రద్దైపోయింది.

ప్రస్తుతం బ్రిట్నీ స్వతంత్రంగా జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఆమె కన్సర్వేటర్‌షిప్‌లో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను, తండ్రికి సంబంధించిన కొన్ని రహస్యాలను పుస్తక రూపంలో ప్రచురించేందుకు పలు  ప్రచురణ సంస్థలు పోటీ పడినప్పటికీ యూస్‌లోని ఓ పబ్లిషింగ్ కంపెనీ రికార్డు స్ఘాయిలో రూ. 112 కోట్లు అప్పజెప్పి పుస్తకం హక్కులు కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తంలో డీల్‌ కుదుర్చుకున్న బ్రిట్నీ.. ఎలాంటి రహస్యాలను బయటపెడుతుందో చూడాలి మరి. 

మరిన్ని వార్తలు