చిల్లర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్‌

17 Mar, 2021 14:04 IST|Sakshi

చావు కబురు చల్లగా నిర్మాత ఫైర్‌

'చావు కబురు చల్లగా' సినిమా ఓటీటీ బాట పడుతుందనే ఊహాగాలపై సీరియస్‌ అయ్యాడు నిర్మాత బన్నీ వాసు. సినిమా రిలీజ్‌ అవకముందే ఓటీటీలోకి వెళ్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నవారి మీద గరమయ్యాడు. "ఇది సందర్భమో కాదో, తెలీదు.. ఏ సినిమా బాగా ఆడినా ఇండస్ట్రీలో అందరం హ్యాపీగా ఫీలవుతాం. ఈమధ్య రెండు సినిమాలు(శ్రీకారం, జాతిరత్నాలు) కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నాకు బుక్‌ అయిన థియేటర్లలో నేను పక్కకు జరిగి మరీ ఆ సినిమాలకు ఇస్తున్నాం. అలాంటి మంచి వాతావరణం ఇండస్ట్రీలో ఉంది. 

కానీ ఈ రెండ్రోజుల్లో నేను బాగా హర్టైన విషయం ఏంటంటే.. వాళ్లు కొత్తగా వచ్చారో తెలీదు. ఎన్ని సినిమాలు చేశారో తెలీదు.. కానీ, ఈ సినిమా రెండు వారాల్లో ఓటీటీలోకి వెళ్లిపోతుందంటూ పీఆర్వోల ద్వారా తప్పుడు వార్తను జనాల్లోకి పాస్‌ చేస్తున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ల పేరు చెప్పడం నాకిష్టం లేదు. హెల్దీగా పోటీపడుదాం. మీరు మంచి సినిమాలు తీయండి, మేము మంచి సినిమాలు తీస్తాను. ఎవరి సినిమా బాగుంటే వారిది ఆడుతుంది. ఎలాగో సినిమా బాగుంటే మీడియా వాళ్లు మమ్మల్ని పొగుడుతారు, లేదంటే ఏకుతారు. 

ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ రాజకీయాల్లో చూశాం. వారు తప్పుడు ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తున్నట్లుగా.. చావు కబురు చల్లగా సినిమా రెండు వారాల్లోనో, మూడు వారాల్లోనో ఓటీటీలో వచ్చేది కాదు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకుంటే కోవిడ్‌ టైమ్‌లోనే ఆహాకు ఇచ్చేవాడిని. కానీ మాకు థియేటర్‌ అంటేనే ఇష్టం. మీరు చిల్లర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు.. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఆలోచిస్తాం" అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. కాగా, చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

చదవండి: 'అక్టోబరు నుంచి డేట్స్‌ ఉంచమని ఫోన్‌ చేశాను'

మరిన్ని వార్తలు