ఓటీటీ వైపు 'రిపబ్లిక్‌' చూపు!

3 Jun, 2021 14:00 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల థియేటర్లు మూతపడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చాలా సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా చిత్రాలు మాత్రం ఎక్కువ కాలం వెయిట్‌ చేయకుండా ఓటీటీ బాట పట్టాయి. పైగా థియేటర్‌లో అంతంతమాత్రంగా ఆడిన సినిమాలు కూడా ఓటీటీలో హిట్టు కొడుతుండటంతో డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

అలా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న సినిమాల లిస్టులో సాయిధరమ్‌ తేజ్‌ 'రిపబ్లిక్‌' సినిమా కూడా ఉన్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తోంది. 'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుండగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్‌ 4న రిలీజ్‌ చేయాలనుకున్నారు, కానీ కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదా వేశారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్‌ను అందిస్తుండటంతో వాటితో డీల్‌ కుదుర్చుకునే దిశగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి రిపబ్లిక్‌ నిజంగానే ఓటీటీలోకి వస్తుందా? లేదా? అనేది క్లారిటీ రావాల్సిందే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: సాయి ధరమ్‌ తేజ్‌ ప్రాజెక్టుకు నో చెప్పిన కృతిశెట్టి?

మరిన్ని వార్తలు