Manoj Patil: నిద్రమాత్రలు మింగిన నటుడు.. మరో నటుడిపై కేసు నమోదు

18 Sep, 2021 10:59 IST|Sakshi

మోడల్‌, బాడీబిల్డర్‌, నటుడు మనోజ్‌ పాటిల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసును నటుడితో పాటు మరో ముగ్గురిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

మనోజ్‌పాటిల్‌ గురువారం ఓషివారాలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది ఉదయం ఒంటి గంట సమయంలో జరగగా గమనించిన ఆయన కుంటుంబ సభ్యులు కూపర్‌ ఆసుపత్రికి తరలించారు. అతని వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాహిల్‌ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.

సాహిల్‌ ఖాన్‌ తన కొడుకును మానసికంగా వేధించాడని మనోజ్ పాటిల్ తల్లి మీడియాకి తెలిపింది. అది ప్రాణాలను తీసుకునే దాకా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదైన అనంతరం నటుడు సాహిల్‌ ఖాన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో రాజ్ ఫౌజ్‌దార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఢిల్లీకి చెందిన అతనికి మనోజ్‌ రూ.2 లక్షలు తీసుకుని, గడువు ముగిసిన స్టరాయిడ్స్‌ ఇచ్చాడని తెలిపాడు. దీంతో గుండె, చర్మ సమస్యలు వచ్చాయని చెప్పాడు.

తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా  రాజ్ ఫౌజ్‌దార్‌ను ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. లావాదేవీలకి సంబంధించిన అన్ని రసీదులు చూపించి సహాయం చేయమని కోరగా, అతనికి మద్దతుగా సోషల్‌ మీడియాలో వీడియో పో​స్ట్‌ చేశాను. అంతేకానీ నాకు ఈ విషయానికి ఏం సంబంధం లేదు’ అని సాహిల్‌ ఖాన్‌ తెలిపాడు. మరోవైపు ఇంతకుముందే సాహిల్‌ సోషల్‌ మీడియాలో తన ఇమేజీని దెబ్బతీస్తున్నాడని ఆరోపిస్తూ మనోజ్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ బాడీబిల్డర్‌ మేనేజర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు