గంగవ్వ టు మల్లిక్‌తేజ.. వెండితెరపై కరీంనగర్‌ వెలుగులు

26 Sep, 2021 11:03 IST|Sakshi

యూట్యూబ్‌ నుంచి వెండితెర వైపు 

లఘుచిత్రాల నుంచి భారీ సినిమాల వరకు

నటులు, రచయితలు, సింగర్లుగా రాణింపు

పేరు తెచ్చిపెట్టిన లఘుచిత్రాలు, ప్రయివేటు ఆల్బంలు

ఉమ్మడి జిల్లానుంచి ఎందరో సిని‘మా’స్టార్లు

ఒక్కచాన్స్‌.. ఒకేఒక్క చాన్స్‌ అంటూ వీళ్లు క్రిష్ణానగర్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్‌లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్‌ స్క్రీన్‌పై ఉమ్మడి కరీంనగర్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్‌ షో ద్వారా ఫేమ్‌ అయిన బిగ్‌బాస్‌ గంగవ్వ, అనిల్‌ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్‌.. స్టార్‌.. సూపర్‌స్టార్‌ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్‌ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్‌ స్పెషల్‌..!!]

పేరు: గంగవ్వ
యూట్యూబ్‌ చానల్‌ 
మై విలేజ్‌ షో
షార్ట్‌ఫిల్మ్‌: 120కి పైగా
సినిమాలు: 4 
‘ఇస్మార్ట్‌’ గంగవ్వ
మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్‌ ప్రారంభించిన మై విలేజ్‌ షో యూట్యూబ్‌ చానల్‌ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్‌ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది.

జీవితమంతా.. ముళ్లబాటే
గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్‌ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్‌ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్‌ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది.

ఆరుపదుల వయసులో..
గంగవ్వకు మై విలేజ్‌ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్‌ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్‌ కష్టాలు అనే షార్ట్‌ఫిల్మ్‌తో యూ ట్యూబ్‌లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్‌ శంకర్, రాజరాజచోర, లవ్‌స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్‌ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్‌ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్‌ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్‌. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్‌లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది.

పేరు: రాదండి సదయ్య
యూట్యూబ్‌ చానల్‌ సదన్న కామెడీ
షార్ట్‌ఫిల్మ్‌లు: 200కి పైగా
సినిమాలు: 10

ఆర్‌ఎస్‌ నందా.. కామెడీకి ఫిదా
విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్‌ఎస్‌ నంద.. యూట్యూబ్‌ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన ఆర్‌ఎస్‌ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

నటన అంటే ప్రాణం 
ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్‌ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్‌తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్‌ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్‌లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్‌ కామెడీ షార్ట్‌ఫిలిమ్స్‌ చేశాడు. కామెడీ స్టార్‌గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు.


పేరు: అనిల్‌ జీల
యూట్యూబ్‌ చానల్‌: మై విలేజ్‌ షో
షార్ట్‌ఫిల్మ్‌లు: 200 కి పైగా
సినిమాలు: 5

క్రేజీహీరో.. అనిల్‌
మల్యాల(చొప్పదండి): ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్‌గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్‌ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్‌ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్‌తో జట్టుకట్టాడు. మై విలేజ్‌ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్‌ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్‌ ఐకాన్‌గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్‌ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్‌ జీల శ్రీకాంత్‌ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్‌ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్‌కు ఫాలోయింగ్‌ పెరిగింది.

ఏడు లక్షల ఫాలోవర్స్‌.. 
మై విలేజ్‌ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్‌లోడ్‌ చేసేందుకు అనిల్‌ జీల వ్లాగ్‌ ప్రారంభించాడు. షూటింగ్‌లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్‌లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్‌ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్‌ కొట్టేశాడు అనిల్‌. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్‌ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌తోపాటు, ఎస్‌ఆర్‌ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్‌ కాగా, దర్శకుడు నవీన్‌ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్‌’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్‌ షో తీస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లోసైతం నటిస్తున్నాడు.

పాటల మాంత్రికుడు మల్లిక్‌
గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌కు చెందిన ఎస్వీ మల్లిక్‌తేజ. ఎస్వీ మ్యూజిక్‌ చానల్‌ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు మల్లిక్‌తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు.

చిన్నతనం నుంచే..
మల్లిక్‌తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్‌లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్‌తేజ మల్లిక్‌పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్‌ను హైదరాబాద్‌ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్‌లో ఎస్‌వీ మ్యూజిక్‌ చానల్‌ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్‌ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్‌వీ మ్యూజిక్‌ చానల్‌ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్‌ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్‌లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్‌ డైరెక్టరుగా పరేషాన్‌ సినిమాలో పాట పాడాడు.

పాటే రమేశ్‌ ప్రాణం
గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్‌. జగిత్యాల జిల్లా చిన్నాపూర్‌కు చెందిన రమేశ్‌ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్‌ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్‌ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్‌ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్‌లో గడ్డం మ్యూజిక్‌ చానల్‌ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్‌ దాటింది. రమేశ్‌ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్‌ రాజ్‌నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్‌ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్‌గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు.

అంచెలంచెలుగా..
ఇల్లందకుంట(హుజురాబాద్‌): ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్‌ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్‌ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్‌గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్‌ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. 

గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వచ్చింది. రాములు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్‌ దగ్గర పనిచేశాడు. ఆనంద్‌సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది.

వెండితెరపై మరెందరో..
విద్యానగర్‌(కరీంనగర్‌): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్‌ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్‌నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్‌ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్‌ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్‌పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్‌రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు. పరేషాన్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు