Ram Gopal Varma: మరో వివాదంలో ఆర్జీవీ.. మోసం చేసాడంటూ చీటింగ్‌ కేసు నమోదు!

24 May, 2022 07:48 IST|Sakshi

ట్విటర్‌లో తనదైన శైలిలో ట్విట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. తాజాగా ఆయనపై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వర్మ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. 

వివాదాల వర్మ
వివరాల్లోకి వెళితే.. రాంగోపాల్ వర్మ సమర్పణలో విడుదలైన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'. ఈ సినిమా యదార్థ ఘటన ఆధారంగా రూపొందించారన్న విషయం విదితమే. నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన.. నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అప్పట్లో ఈ సినిమా చూట్టు వివాదాలు చుట్టుముట్టడంతో పలుమార్లు చిత్రం విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చినా, చివరికి ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.

అయితే శేఖర్‌ రాజు ఫిర్యాదులో.. కొన్నాళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మతో తనకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను వర్మకి జనవరి 2020లో ₹ 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ మొత్తాన్ని వర్మ ‘ఆశ’ సినిమా విడుదలకు ముందే తనకి తిరిగి ఇస్తానని హామి ఇచ్చినట్లు తెలిపారు. అయితే వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు గ్రహించానని అందుకే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా రాంగోపాల్ వర్మ తన సినిమాలు, వ్యవహార శైలితో వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు.

చదవండి: ఖుషి షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్‌, సామ్‌కి గాయాలు?

మరిన్ని వార్తలు