Cheppalani Undhi Movie Review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ

9 Dec, 2022 15:52 IST|Sakshi
Rating:  

టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ)
నటీనటులు: యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌, సత్య, పృథ్వీరాజ్, తనికెళ్ల భరణి, అలీ, రాజీవ్ కనకాల, మురళి శర్మ, రఘుబాబు, సునీల్
నిర్మాణ సంస్థలు: సూపర్‌ గుడ్ ఫిల్మ్స్, హ్యామ్స్‌టెక్ ఫిల్మ్స్
నిర్మాత:  ఆర్‌బీ చౌదరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్
సంగీతం: అస్లాం కేయి
విడుదల తేదీ: డిసెంబర్ 09, 2022

యశ్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించిన చిత్రం​  'చెప్పాలని ఉంది'.  ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి అరుణ్ భారతి దర్శకత్వ వహించగా.. ఆర్‍బీ చౌదరి నిర్మించారు. డిసెంబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

అసలు కథేంటంటే.. 
ఈ సినిమాలో హీరో యశ్ పూరి(చందు) ఓ టీవీ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. మాతృభాష అంటే చిన్నప్పటి నుంచి హీరోకు విపరీతమైన అభిమానం. కుటుంబం కోసం రిపోర్టింగ్‌తో పాటు బైక్‌ ట్యాక్సీ నడుపుతుంటాడు. అదే సమయంలో స్టెఫీ పటేల్(వెన్నెల) పరిచయమవుతుంది. హీరో ఆటిట్యూడ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు చందు బైక్‌పై వెళ్తుంటే  యాక్సిడెంట్‌కు గురవుతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఈ కథలో హీరో తన ప్రేమను గెలిచారా? యాక్సిడెంట్ తర్వాత కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. మాతృభాష విషయంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.  

ఎలా ఉందంటే...

సినిమా ప్రారంభం నుంచి హీరో యశ్ పూరి(చందు) పనిచేసే టీవీ ఛానెల్ చుట్టే తిరుగుతుంది. టీఆర్పీ రేటింగ్‌ కోసం వాళ్లు పడే కష్టాలను సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీ, సత్య మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. రిపోర్టింగ్‌ చేస్తూనే ఇంటి నుంచి తప్పిపోయిన చిన్న పిల్లలను సేవ్ చేయడం, అదే సమయంలో హీరోకు స్టేఫీ పటేల్ (వెన్నెల)తో పరిచయం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని సత్యమూర్తి(మురళి శర్మ)ను చందు ఒప్పిస్తాడు. ఆ తర్వాత హీరోకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాతే జరిగే కథే సినిమాలో అసలైన ట్విస్ట్.ఆ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. 

సెకండాఫ్‍లో కథ మొత్తం హీరో మాట్లాడే భాష చుట్టే తిరుగుతుంది. ఎవరికీ అర్థం కానీ భాషలో మాట్లాడే హీరోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అసలు అతను మాట్లాడేది భాషేనా? లేక మానసిక వ్యాధినా? అనే విషయం చుట్టే సెకండాఫ్‌లో హైలెట్. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు హీరోయిన్ వెన్నెల హిమాలయాలకు వెళ్లడం, రాజీవ్ కనకాల(డాక్టర్ కేశవ్), సత్య చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు అంతరించిన పోయిన భాష చుట్టే కథ మొత్తం నడిపించాడు. సినిమా మధ్యలో సునీల్ ఎంట్రీ, బాబాగా అలీ పాత్రలు అదనపు బలం.  ఈ సినిమాలో ఒక్కమాటలో  చెప్పాలంటే 'పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం' అనేలా ఉంది. తెలుగు భాషను కాపాడుకుందాం  అనే సందేశాన్నిచ్చారు దర్శకుడు. 

ఎవరెలా చేశారంటే...

రిపోర్టర్‌ పాత్రలో హీరో చందు ఆకట్టుకున్నాడు. అర్థం కానీ భాషను అవలీలగా మాట్లాడి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల పాత్రలో హీరోయిన్ స్టెఫీ పటేల్ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పృథ్వి, సత్య కామెడీ పాత్రలకు తగిన న్యాయం చేశారు. విలన్‌ పాత్రలో ఎమ్మెల్యే రామకృష్ణగా రఘు బాబు సత్యమూర్తిగా మురళి శర్మ, డాక్టర్ కేశవ్‌గా రాజీవ్‌ కనకాల, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి తమ నటనతో మెప్పించారు. అలీ, సునీల్ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేశారు. అస్లాం కేయి సంగీతం ఫరవాలేదు. సూపర్‌ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు