Chhello Show: ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు ఉంది.. కానీ మాకు అదే ముఖ్యం.. ఛెల్లో షో నిర‍్మాత

5 Oct, 2022 16:35 IST|Sakshi

ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కి నెట్టి అస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్‌ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ సినిమాపై చర్చ మొదలైంది.  ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఎంపికను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సైతం తప్పుబట్టింది. విదేశీ చిత్రానికి రీమేక్ కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్‌ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది.  

తాజాగా వీటిపై 'ఛెల్లో షో' ప్రొడ్యూసర్ సిద్ధార్థ్‌ రాయ్ కపూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ' మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఎంపిక చేసింది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు అదే గౌరవం. సినిమాపై ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. అందువల్ల ఇతరుల మాటలను మేం పట్టించుకోం. ఈ దేశంలోని ప్రతి తమ అభిప్రాయం వెల్లడించేందుకు హక్కు ఉంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అభ్యంతరం చెప్పడంలో అందులో తప్పేమీ లేదు. అది వారి అభిప్రాయం మాత్రమే' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన  తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు.  పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో  భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు