ఆకాశ్‌ పూరి క్లాప్‌తో ప్రారంభమైన చైతన్య పసుపులేటి మూవీ

6 Oct, 2022 15:35 IST|Sakshi

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సత్యసాయి కల్యాణమండపంలో ఘనంగా జరిగాయి. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

అనంతరం దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుంచి చీరాలలో మొదటి షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం' అన్నారు.

చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులందరికీ  దసరా శుభాకాంక్షలు. మేం పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్  పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో  వస్తున్న ఈ సినిమా.. మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. 'ఇది నా మూడవ సినిమా. నా మెదటి సినిమా నుంచి వెంకటేష్ గారు నాకు తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అన్నారు. హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ.. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయ్‌ దేవరకొండ "ఖుషి", అనంత సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.

చదవండి: ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌

మరిన్ని వార్తలు