Chiranjeevi: డిసెంబర్‌ 31న కచ్చితంగా ఆ పని చేయాల్సిందే!

1 Jan, 2023 13:34 IST|Sakshi

కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి అందరూ గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్తున్నారు. హీరోలు కూడా కొత్త సినిమాలతో ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో 'సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

సాధారణంగా డిసెంబర్‌ 31 వస్తే యువకులు ఇంట్లో కాకుండా పబ్బుల్లోనో, పార్టీల్లోనో ఉంటారు, కానీ తను మాత్రం ఎప్పుడూ పార్టీలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లైన చాలా ఏళ్ల వరకు కూడా డిసెంబర్‌ 31 రాత్రి 11.30 గంటలకు పూజ గదిలో కూర్చుని ఆంజనేయ స్వామి ముందు ధ్యానం చేసుకునేవాడినని పేర్కొన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు టపాసుల శబ్ధం వినగానే అప్పుడు లేచి ఇంట్లో అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడినని తెలిపారు. తన భార్య సురేఖ ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని చెప్పారు.

రామ్‌చరణ్‌ విషయానికి వస్తే.. తనలాగే అతడు కూడా అందరూ తన కుటుంబమే అని భావిస్తాడని చిరు ప్రశంసించారు. కానీ తాను ఓపెన్‌గా ఉంటే చరణ్‌ మాత్రం గుంభనంగా ఉంటాడని.. ఈ ఒక్క విషయంలో తామిద్దరికీ అసలు పోలికే ఉండదని చెప్పుకొచ్చారు. ఇక చరణ్‌- ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలియగానే ఒకరకమైన భావోద్వేగానికి లోనయ్యానన్నారు. ఆరోజు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు చిరంజీవి.

చదవండి: స్టార్‌ హీరోల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..
వీరసింహారెడ్డిలో ఆ సీన్‌ చూస్తే కంటతడి పెట్టాల్సిందే!

మరిన్ని వార్తలు