వాయిదా బాటలో మెగాస్టార్‌ 'ఆచార్య' సినిమా

27 Apr, 2021 11:13 IST|Sakshi

కరోనా వల్ల గతేడాది తెలుగు ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. కొన్ని నెలలపాటు థియేటర్లు తెరుచుకోనేలేదు. కానీ విచిత్రంగా ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం జనాలు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తూ థియేటర్లకు తరలి వచ్చారు. ఫలితంగా ఎన్నో సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతోపాటు దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇది చూసి సినీ ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు వచ్చాయని అందరూ సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఈసారి కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభించడంతో సినిమాకు గడ్డు రోజులు మొదలయ్యాయి.

ఈసారి ప్రభుత్వాల కన్నా ముందే తెలుగు ఇండస్ట్రీ స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు సినిమాలు వాయిదాబాట పట్టాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్‌సేన్‌ 'పాగల్'‌ రిలీజ్‌లు వాయిదా వేసుకోగా తాజాగా మెగాస్టార్‌ కూడా అదే బాటలో నడిచాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమా మే 13న రిలీజ్‌ అవ్వడం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టులో ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ సిద్ధ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌, చెర్రీకి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.

చదవండి: సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్‌ బ్రేక్‌’

‘ఆచార్య’ టీంకు భారీ షాక్‌, మెగాస్టార్‌కు సైతం అదే బెడద

మరిన్ని వార్తలు