ఆచార్య షూటింగ్‌ పూర్తి.. వైజాగ్‌లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్‌!

10 Aug, 2021 11:30 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఆ తర్వాత మోహన్‌ రాజాతో లూసిఫర్‌ రీమేక్‌,  మెహర్‌ రమేశ్‌తో వేదాళం రీమేక్‌, బాబీతో ఓ మూవీ చేయనున్నాడు. అయితే లూసిఫర్‌ షూటింగ్‌లో పాల్గోనడానికి ముందు చిరు చికిత్స తీసుకునేందుకు విశాఖపట్నం వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నేచర్‌క్యూర్‌ ఆయుర్వేద చికిత్స కోసం ఆయన వైజాగ్‌ వెళ్లినట్లు టాలీవుడ్‌లో టాక్‌. డీటాక్సిఫికేషన్‌, రెజువెనేషన్‌ ప్రక్రియలో భాగంగా అక్కడి ప్రముఖ ఆయుర్వేదిక్‌ స్పా సెంటర్‌కు వెళ్లారట. అక్కడే పది రోజులు పాటు ట్రీట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం ఆయన లూసిఫర్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. ఆయనతో పాటు నిర్మాత దిల్‌ రాజు కూడా అక్కడికి చికిత్స వెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో కూడా చిరు బాడీ డిటాక్సిఫికేషన్‌ చేయించుకునేందుకు వైజాగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 

కాగా అలసట నుంచి శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రక్రియనే డిటాక్సిఫికేషన్ అంటారు. ఆయుర్వేదిక్‌లో ఇది ఎంతో పురాతన ప్రాచుర్యం కలిగిన వైద్యం. ఒత్తిడి, కాలుష్యంతో పాటు శరీరంలో పెరుకుపోయిన వ్యర్థాలను తీసేసే ప్రక్రియయే ఈ డిటాక్సిఫికేషన్. మెదడు, మనసును కూడా క్లీన్ చేయడమే ఈ చికిత్స ప్రత్యేకత. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది సెలబ్రెటీలు ఈ వైద్యాన్ని చేయించుకుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు రిలాక్సేషన్ కోసం తరచూ ఈ ఆయుర్వేదిక్ డిటాక్సిఫికేషన్ వైద్యాన్ని చేసుకుంటారట. 

>
మరిన్ని వార్తలు