Megastar Chiranjeevi: ఉత్తేజ్‌ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం

30 Sep, 2021 20:01 IST|Sakshi

ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత ఉత్తేజ్ భార్య పద్మావతి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. క్యాన్స‌ర్‌ సంబంధిత వ్యాధితో ఈ నెల 13న ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబ‌ర్ 30) ఉత్తేజ్ తన భార్య ప‌ద్మ సంస్మ‌ర‌ణ స‌భను హైద‌రాబాద్‌లోని ఫిలింనగర్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్‌ చిరంజీవి, పలువురు టాలీవుడ్‌ ప్రములు హజరై పద్మకు ఘన నివాళి అర్పించారు. చిరును చూడగానే ఉత్తేజ్‌ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యి ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను, కూతురు చేతనను ఓదార్తూ చిరు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్‌

ఇక ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘భార్యా వియోగం అన్నది చాలా  దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న  సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను.  హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో  నాకు మంచి అనుబంధం ఏర్పడింది.  ఈ ఆపద సమయంలో ఉత్తేజ్‌కు మనమందరం అండదండగా ఉండాలి. ఈ విషాదం నుండి ఉత్తేజ్  త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సంతాప సభకు మెగాస్టార్‌తో పాటు మెగా బ్రదర్‌ నాగాబాబు, హీరోలు డా. రాజశేఖర్, శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ,  ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్‌మెన్‌ భార్య

మరిన్ని వార్తలు