మళ్లీ ఆచార్య సెట్‌లో సందడి చేయనున్న చిరు, చరణ్‌!

16 Sep, 2021 12:28 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కాగా ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకోవడంతో ఆయన గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్‌ ఇండియా మూవీని స్టార్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా చిరు, చెర్రిలు మళ్లీ ఆచార్య షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరు గాడ్‌ఫాదర్‌, చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఆచార్యలోని రెండు పాటల చిత్రీకరణను కొరటాల వాయిదా వేశారట.

చదవండి: అమెరికాలో సందడి చేస్తున్న జగపతి బాబు

ఇప్పుడు ఈ పాటలను తిరిగి షూట్‌ చేయాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారని, ఇందుకోసం హైదారాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో చిరు, చరణ్‌లపై ఓ సాంగ్‌ షూటింగ్‌ను నిర్వహించబోతున్నాడట. మరో పాట షూటింగ్‌ చరణ్‌-పూజా హెగ్డేలపై జరగనుందని, వచ్చే వారం ఈ పాట షూటింగ్‌ను జరపనున్నట్లు సమాచారం. ఈ నెల చివరిలోపు రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోందట. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’లో చరణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు