కిషన్‌ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

9 Jul, 2021 10:51 IST|Sakshi

కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి ప‌ద‌వి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి అభినందనలు తెలిపారు. కేంద్ర కేబినెట్‌లో కిషన్‌రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ సందర్భంగా చిరంజీవి ట్విటర్‌ వేదికగా కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశాడు. మన దేశం యొక్క యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్‌ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా, గ‌త కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా  బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కిషన్‌రెడ్డి విషయానికి వస్తే.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు