మిల్కా సింగ్‌ మృతికి చిరంజీవి, మహేశ్‌, బాలకృష్ణ సంతాపం

19 Jun, 2021 14:15 IST|Sakshi

పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌(91) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు  మహమ్మారితో పోరాడిన ఆయన ఇటీవల కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా సంబంధిత సమస్యలతో శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ మహేశ్‌ బాబు, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మిల్కా సింగ్‌ మృతికి నివాళులు అర్పించారు.

మెగాస్టార్‌ ట్టీట్‌ చేస్తూ.. ‘పరుగుల వీరుడు #MilkhaSinghJi మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్ట ను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయిలో రెపరెప లాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు.

ఇక మహేశ్‌ బాబు ట్వీట్‌ చేస్తూ.. ‘మీ మ‌ర‌ణం నాకెంతో మ‌న‌స్థాపం క‌లిగించింది. మీ న‌ష్టం పూడ్చ‌లేనింది. మీరు అథ్లెట్స్‌కి స్పూర్తివంతంగా ఉంటారు’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ సైతం ‘మిల్కా సింగ్ మ‌ర‌ణ వార్త చాలా హృద‌య విదార‌కం. స్వాతంత్య్రం త‌ర్వాత ఎలా న‌డుచుకోవాలో చూపించారు. మీరు రాబోయే తరాల‌కు స్పూర్తి. మా హీరో మీరు. దేశం మిమ్మ‌ల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. మీ జీవితం నుండి ఎంతో మంది ప్రేర‌ణ పొందుతారు’ అంటూ ఆయన మృతికి నివాళులు అర్పించారు.  

చదవండి: 
మిల్కాసింగ్‌ అస్తమయం: బావురుమన్న అభిమానులు 
ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్‌..

మరిన్ని వార్తలు