Krishnakumar Kunnath: సింగర్‌ కేకే మృతికి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళి

1 Jun, 2022 15:48 IST|Sakshi

ప్రముఖ సింగర్‌ కేకే (కృష్ణకుమార్‌ కున్నత్‌) హఠాన్మరణం యవత్‌  దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఆయన మృతి టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘కేకే మరణ వార్త నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అద్భుతమైన గాయకుడు, గొప్ప వ్యక్తి. కేకే నా కోసం ‘ఇంద్ర’లోని ‘దాయి దాయీ దామా’ పాట పాడారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ చిరంజీవి నివాళులు అర్పించారు.

చదవండి: సింగర్‌ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు!

అలాగే మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌ వంటి హీరోలు కేకే మృతికి సంతాపం తెలియజేశారు. ‘కేకే అకాల మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన ఒక గొప్ప గాయకుడు. అతని కుటుంబానికి,  సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ మహేశ్‌ సంతాపం ప్రకటించారు. అలాగే రామ్‌ చరణ్‌, పవన్‌ కల్యాణ్‌లు కూడా కేకే మృతి నివాళులు అర్పించారు. 

చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్‌

‘కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం’ అంటూ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు