Megastar Chiranjeevi: ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా: చిరు ఎమోషనల్ స్పీచ్

28 Nov, 2022 18:34 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో అవార్డ్ స్వీకరించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022  అవార్డును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకలో సతీసమేతంగా ఆయన హాజరయ్యారు. అవార్డు అందుకున్న మెగాస్టార్ వేదికపైనే భావోద్వేగానికి గురయ్యారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే ప్రకటించారు.

(చదవండి:మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు)

చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు యువహీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. ఈ అవార్డు నా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా.  నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోను. నేను ఎప్పుడు మీతోనే ఉంటా. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కుడున్నా వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు. నా స్నేహితుడు అక్షయ్ కుమార్ ఇక్కడే ఉన్నారు. నేను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని బాధపడ్డా. కానీ ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. ' అంటూ చిరు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.  

మెగాస్టార్ మాట్లాడుతూ..' నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే నాకు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు విరామం వచ్చింది. పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం.' అని అన్నారు. 

మరిన్ని వార్తలు