Chiranjeevi: ఆమెతో పని చేసిన క్షణాలు ఆస్వాదించా: చిరంజీవి

11 Feb, 2023 15:24 IST|Sakshi

ప్రముఖ సింగర్‌ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్‌లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్‌ చిరంజీవి మొదటి గెస్ట్‌గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్‌లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 

ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్‌తో స్క్రీన్‌ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి  మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు.

సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్‌ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. 

దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్‌ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్‌' లాంటి సూపర్‌ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్.
  

మరిన్ని వార్తలు