పాజిటివ్‌... కానీ లక్షణాలు లేవు

10 Nov, 2020 06:26 IST|Sakshi

కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతోంది. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పలువురు కరోనా బారిన పడి కోలుకోగా, మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా హీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి జాయిన్‌ కావాల్సి ఉంది. షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా ముందస్తుగా చేయించుకున్న కోవిడ్‌ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

‘‘ఆచార్య’ షూటింగ్‌ ప్రారంభించాలని కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. రిజల్ట్‌ పాజిటివ్‌. నాకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవు. వెంటనే హోమ్‌ క్వారంటైన్‌ అయ్యాను. గత నాలుగైదు రోజుల్లో నన్ను కలిసినవారందరూ కూడా కోవిట్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు