ఓటీటీలో కాదు థియేటర్స్‌లోనే ‘కోబ్రా’

12 Apr, 2021 08:18 IST|Sakshi

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న సినిమాలు, షూటింగ్‌ చివరిదశలో ఉన్న సినిమాల నిర్మాతల్లో కొందరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూస్తున్నారు. కోలీవుడ్‌లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో విక్రమ్‌ హీరోగా నటించిన ‘కోబ్రా’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాదని, ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందనే టాక్‌ వినిపించింది.

ఈ సినిమా విడుదలపై చిత్రయూనిట్‌ స్పందిస్తూ– ‘‘కోబ్రా’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలు నిజం కాదు. థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం’’ అని పేర్కొంది. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ‘కోబ్రా’ విడుదల కానుందనే వార్తలు కోలీవుడ్‌లో వినిపించాయి. కానీ ఇప్పుడు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా విడుదల మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు