Chiyaan Vikram: చాలాకాలం తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతున్న విక్రమ్‌ సినిమా

28 May, 2023 07:38 IST|Sakshi

తను నటించే పాత్రలకు 100 శాతం న్యాయం చేయడానికి తపించే నటుడు చియాన్‌ విక్రమ్‌. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో చోళరాజు కరికాలన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి గుండెల్లో నిలిచిపోయిన విక్రమ్‌ తాజాగా తంగలాన్‌ చిత్రంలో గిరిజన వాసి పాత్రకు జీవం పోస్తున్నారు. ఈయన చాలాకాలం క్రితం కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువనక్షత్రం. 

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌, రీతు వర్మ, హీరోయిన్‌లుగా నటించగా నటి సిమ్రాన్‌, పార్తీపన్‌, వినాయకన్‌, దివ్యదర్శిని, అర్జున్‌దాస్‌, వంశీకృష్ణ, రాధిక శాస్త్రకుమార్‌, మాయా ఎస్‌.కృష్ణన్‌, అభిరామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉండిపోయింది. అయితే దీని విడుదలకు ఇప్పుడు టైమ్‌ వచ్చినట్లు సమాచారం.

ఇటీవలే దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చిత్రం ప్యాచ్‌ వర్క్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసినట్లు, నటుడు విక్రమ్‌ డబ్బింగ్‌ కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. మరో విశేషమేమిటంటే ఈ చిత్ర విడుదల హక్కులను రెడ్‌జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందినట్లు సమాచారం. చిత్రాన్ని జులై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా నటుడు విక్రమ్‌ డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు