‘టెనెట్’‌ చూసి ఆనందించండి: క్రిస్టోఫర్ నోలాన్

3 Dec, 2020 13:02 IST|Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ భారతీయ సినీ అభిమానులకు ఓ తీపి కబురు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘టెనెట్‌’ సినిమాను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘టెనెట్‌’ చిత్రాన్ని ఆయన కరోనా కాలంలోనే విడుదల చేసి అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా డిసెంబర్‌ 4 (శుక్రవారం)న భారత్‌లోని పలు నగరాల్లో విడుదల కాబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్‌ అభిమానులకు కోసం ఓ విడియోను సందేశాన్ని పంచుకున్నారు. ‘హాయ్‌.. నేను ‘టెనెట్‌’ చిత్ర దర్శకుడైన మీ క్రిస్టోఫర్ నోలాన్‌. భారతీయ అభిమానులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. మీరు(అభిమానులు) రేపు టెనెట్‌ సినిమా చూడబోతున్నారు. మీకు ఈ అవకాశం రావటం పట్ల నాకు చాలా థిల్లింగ్ ఉంది. టెనెట్‌ బిగ్‌ స్క్రీన్‌పై విడుదల కాబోతుంది. ముంబైతో పాటు పలు దేశాల్లో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసి ఆనందించండి. మీకు కృతజ్ఞతలు’అని ఆ వీడియో ద్వారా నోలాన్‌ అభిమానులను పలకరించారు. చదవండి: అందరి సమక్షంలో ఆస్కార్‌

అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇండియాలోని ముంబైలో తెరకెక్కించామని, ఆ సీన్స్‌లో  ఇండియన్‌, బాలీవుడ్‌ నటి డింపుల్‌ కపాడియాతో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమెతో నటించిన పలు సన్నివేశాలు తనకు చాలా ఉత్సాహం కలిగించాయని తెలిపారు. తనతో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం ఆనందం కలిగించిందని చెప్పారు. ఈ చిత్రం ఇంగ్లీష్‌, హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల కానుంది. కరోనా వైరస్‌తో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ మళ్లీ థియేటర్లను ప్రారంభించుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. కాగా, లాక్‌డౌన్‌ అనంతరం థియేటర్లలో విడుదలయ్యే భారీ బడ్జెట్‌ చిత్రం టెనెట్‌. ఇప్పటికే ఈ చిత్రాన్ని 70 దేశాల్లో విడుదల చేశారు. తాజాగా ఇండియాతో పాటు డెన్మార్క్‌, ఎస్టోనియా, ఇటలీ, నార్వే, యూకే, అమెరికాలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. బాట్‌మాన్‌ బిగిన్స్, ది డార్క్ నైట్ సిరీస్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా  క్రిస్టోఫర్ నోలాన్ అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు