సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

31 Dec, 2020 21:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నర‌సింహ యాద‌వ్‌ను ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర్సింగ్‌ యాద‌వ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించిన ఆయన కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ మంచి పాత్ర చేశారు. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన హేమాహేమీలుతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబ‌ర్ 150లోనూ న‌టించారు. గ‌త కొంత‌కాలంగా నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జ‌రుగుతోంది. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు