సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు

21 Dec, 2020 03:31 IST|Sakshi
శ్రీనివాస్‌ రెడ్డి, అలీ, వైవీ సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌ కానూరి, లక్ష్మీ పార్వతి, అనురాగ్, కృష్ణకుమార్‌

‘‘కనుమరుగైపోతున్న చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఆశయంతో వారి ఇబ్బందుల నేపథ్యంలో ‘రాధాకృష్ణ’ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. అనురాగ్, ముస్కాన్‌ సేథీ జంటగా, ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో టి.డి. ప్రసాద్‌ వర్మ దర్శకత్వం వహించారు. పుప్పాల సాగరిక, కృష్ణ కుమార్‌ నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘తెలుగు పరిశ్రమకు ఎలాంటి పథకాలు కావాలన్నా మా ముఖ్యమంత్రి జగన్‌గారు సిద్ధంగా ఉన్నారు.

హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లుగానే ఏపీలోనూ అభివృద్ధి చేయడానికి సీయం చర్యలు చేపడుతున్నారు’’ అన్నారు. ‘‘నేను యాక్ట్‌ చేయడం ఏంటి? అని నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్‌ రెడ్డి పట్టుబట్టి నన్ను నటింపజేశారు. ప్రాచీన కళలను కోల్పోతే మన మనుగడ కోల్పోయినట్టే’’ అన్నారు లక్షీ పార్వతి. ‘‘వైవీ సుబ్బారెడ్డిలాంటి మంచి మనిషి మా ట్రైలర్‌ను  రిలీజ్‌ చేశారు. అప్పుడే ఈ సినిమా విజయం కన్ఫర్మ్‌ అయిపోయింది. ఈ  సినిమాని సెన్సార్‌ వాళ్లు ప్రశంసించారు’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు సాగరిక కష్ణకుమార్‌. అలీ, దర్శకుడు టీడీ ప్రసాద్‌ వర్మ, ముస్కాన్‌ సేథీ తదితరులు పాల్గొన్నారు. – టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

మరిన్ని వార్తలు