Roller Raghu: ఎన్టీఆర్ అంటే ప్రాణం.. తారకరత్న మరణం కలిచివేసింది: రఘు

11 Mar, 2023 20:51 IST|Sakshi

కమెడియన్ రఘు కారుమంచి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోలర్ రఘుగా అభిమానుల్లో గుర్తింపు పొందారు. నటనకు కొద్దిగా బ్రేక్‌ ఇచ్చిన ఆయన అదుర్స్‌, లక్ష్మి, కిక్‌, నాయక్‌, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించారు. మంచి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల క్రితమే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రఘు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. 

రఘు మాట్లాడుతూ 'నా కెరీర్‌ ఇంతవరకు రావడానికి కారణం రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల లాంటి గొప్ప వ్యక్తి దొరకడం గొప్ప విషయం. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. వారిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఏది చేయమన్నా నేను సిద్ధం. ఆయన కోసం ఏం చేయడానికైనా వెనకాడను. నా బాడీలో ఆయనొక పార్ట్‌గా మిగిలిపోయారు.  ఆయన నన్నెప్పుడు పెద్దన్న అని పిలిచేవారు. మేం ఎప్పుడు కలవలేదు అనుకుంటారు. మేం కలిశామని పబ్లిక్‌కు ఎందుకు తెలియాలి. ప్రస్తుతం నా జీవితంలో చాలా ప్రశాంతంగా ఉ‍న్నా. రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌, ప్రభాస్, వెంకటేశ్‌తో సినిమాలు చేశా. తారకరత్న మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పిల్లలంటే ఆయనకు ప్రాణం. నిషిక అప్పుడప్పుడు సెట్‌కు కూడా వచ్చేది. నాకు ఎలాంటి ఆస్తు లేవు. ఉన్నవే  పోగొట్టుకున్నా. కానీ ఇప్పుడు సంపాదించుకున్నా. లైఫ్ అంటే ఔటర్ రింగ్‌ రోడ్డు కాదు. సిటీ రోడ్లు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకున్నా. నేను ఇంతవరకు సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి దగ్గర పని చేయలేదు. ఈ ఏడాది కలిస్తోందేమో వేచి చూడాలి.' అని అన్నారు. 

కాగా.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో కామెడీ స్కిట్స్‌ చేయడమే కాదు టీం లీడర్‌గా వ్యవహరించాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు సైతం గుడ్‌బై చెప్పేశారు రఘు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తున్న రఘు లాక్‌డౌన్‌లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ‍న్నాడు. అయితే తక్కువ కాలంలోనే ఓ లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారు. 

మరిన్ని వార్తలు