కరోనా పంజా.. టాలీవుడ్‌లో విషాదం

18 Apr, 2021 11:44 IST|Sakshi
కరోనాతో మృతి చెందిన కోడైరెక్టర్‌ సత్యం (ఫైల్‌ ఫోటో)

కోవిడ్‌తో ముగ్గురు మృతి  

బంజారాహిల్స్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వైపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా ఇంకోవైపు మరణాలు కూడా పెరుగుతుండటంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. ప్రముఖ కోడైరెక్టర్‌ సత్యం కోవిడ్‌తో శనివారం ఉదయం కన్నుమూశారు. అలాగే ఓ సీరియల్‌ మేనేజర్‌  కూడా కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. క్యార్‌వ్యాన్‌ డ్రైవర్‌ సైతం కరోనాతో కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌లో నలుగురికి కరోనా సోకడంతో ఆ సినిమా షూటింగ్‌ మధ్యలోనే నిలిపివేశారు. ముగ్గురు హీరోయిన్లు ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. షూటింగ్‌లలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న సాంకేతిక నిపుణులతో కరోనా అంటుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రంలో లాక్‌డౌన్‌ సందర్భంగా అక్కడి షూటింగ్‌లు హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యాయి. గత మూడు వారాల నుంచి బాలీవుడ్‌ సినిమాలు ఇక్కడే నిర్మాణం జరుపుకుంటుండగా పెద్ద ఎత్తున సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు హైదరాబాద్‌కు వచ్చారు. రెండు తమిళ సినిమాలు కూడా హైదరాబాద్‌లోనే షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. చెన్నై నుంచి కూడా వంద మందికి పైగా సాంకేతిక నిపుణులు హైదరాబాద్‌లో బస చేశారు.

మరిన్ని వార్తలు