ముంబై: భారతీయ ప్రముఖ నాట్యకారుడు అస్తాద్ డెబూ(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని నివాసంలో అస్తాద్ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు.. ‘‘ఈరోజు వేకువజామున ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. నృత్యం పట్ల ఉన్న అంకితభావమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది. వేలాది మంది గుండెల్లో ఆయనకు స్థానం కల్పించింది. నేడు భౌతికంగా ఆయన దూరమయ్యారు. కానీ అభిమానుల మనస్సుల్లో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు’’ అని ఇన్స్టాలో పోస్టు షేర్ చేశారు. (చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)
కాగా కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వర్లీలో అస్తాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కథక్, కథాకళి ప్రదర్శనలతో అద్భుతాలు చేసిన అస్తాద్ డెబూ.. భారత, పాశ్చాత్య కలయికతో సరికొత్త నృత్యరూపకాలు సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 80,90వ దశకాల్లో ఆయన కెరీర్ తారస్థాయికి చేరుకుంది. అస్తాద్ మృతి పట్ల సినీ ప్రముఖులలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.