Atrocity case : దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు, స్పందించిన నటుడు

18 Aug, 2021 21:22 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించారంటూ అరుణ్ పై నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో అరుణ్ పై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా దీనిపై అరుణ్ స్పందించాడు. అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పాడు.

ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే ఆయన ఎవరో తెలియదని చెప్పడంతో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారన్నాడు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్‌లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని పేర్కొన్నాడు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని, నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని వెల్లడించాడు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేగాక ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించాడు. 

మరిన్ని వార్తలు