దాసరి జయంతి: పాన్ ఇండియా దర్శకులకు సత్కారం

5 May, 2022 15:48 IST|Sakshi

దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు.

దాసరి బయోపిక్ ను ‘దర్శకరత్న’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్... తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు.  

ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి,  బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

ఈసందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ "దర్శకరత్న" పోస్టర్ ను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు