తండ్రి చివరి మాటలను గుర్తు తెచ్చుకున్న బాబిల్‌

29 Apr, 2021 15:27 IST|Sakshi

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి నేటికి(గురువారం) ఏడాది పూర్తవుతోంది. గతేడాది ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికి కొంతకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన లండన్‌లో వైద్యం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ మాయదారి క్యాన్సర్‌ నటుడిని బలితీసుకుంది. నేడు ఆయన మొదటి వర్ధంతి. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్‌ ప్రముఖులు,​ నివాళులర్పిస్తున్నారు. 

కాగా ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు బాబిల్‌ ఖాన్‌, అయాన్‌ ఖాన్‌ ఉన్నారు. ఇటీవల వారు ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్నాడు బాబిల్‌. ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చాము. నాన్న చనిపోయే చివరి రెండు రోజులు తనతోనే ఉన్నాను. స్పృహ కోల్పోతున్నట్లు కనిపించాడు. నా వైపు చూస్తూ.. నవ్వుతూనే ఓ మాట చెప్పాడు. నేను చనిపోతున్నాను. కాదని వారిస్తున్న వినకుండా నవ్వుతునే ఉన్నాడు.. ఆ తర్వాత అలాగే నవ్వుతూ నిద్రలోకి వెళ్లాడు’ అని  తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు.

ఇక ఇర్ఫాన్ ఖాన్.. ది నెమ్సేక్, పాన్ సింగ్ తోమర్, హైదర్, సలామ్ బాంబే, పీకూ, హిందీ మీడియం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్‌, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మన్ననలు అందుకున్నాడు. అలాగే తెలుగులోనూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించాడు.

చదవండి: ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు

మరిన్ని వార్తలు