కీలక విషయాలు వెల్లడించిన దీపిక మేనేజర్‌!

25 Sep, 2020 19:52 IST|Sakshi

ముంబై: డ్రగ్స్‌ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట హాజరైన టాలెంట్‌ మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ జయ సాహా, తాను, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నామని, సదరు గ్రూప్‌ ద్వారానే మాదక ద్రవ్యాల గురించి చర్చించేవాళ్లమని కరిష్మ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ గ్రూప్‌నకు దీపికానే అడ్మిన్‌గా ఉండేవారని, తరచుగా హష్‌(డ్రగ్‌) గురించి అడిగేవారని ఎన్‌సీబీ ఎదుట వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. (చదవండి: సుశాంత్‌ది హత్యేనని ఆ ఫొటోలు చెబుతున్నాయి!)

ఈ మేరకు 2017లో తాము ముగ్గురం చేసిన చాట్స్‌కు సంబంధించి వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి కరిష్మాను హాజరు కావాల్సిందిగా ఆదేశించిన ఎన్‌సీబీ, దీపికాను, ఆమెను ఎదురెదురుగా ఉంచి విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా కరిష్మా ప్రకాశ్‌ దీపికా వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఎన్‌సీబీ విచారణకు హాజరైన హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, డ్రగ్స్‌ గురించి తాను రియా చక్రవర్తితో చాట్‌ చేశానని అంగీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2018లో రియాతో తమ ఇంట్లో ఉన్న ఓ మొక్క(గంజాయి వంటిది) చర్చించినట్లు సదరు మీడియా పేర్కొంది. అయితే తాను ఎన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదని రకుల్‌ ఎన్‌సీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొంది. కాగా సుశాంత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్టు చేసిన అధికారులు, లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జయ సాహా వెల్లడించిన వివరాల మేరకు పలువురు నటీమణులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.     
 

మరిన్ని వార్తలు