FIR against Raj Kundra, Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై మరో కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు.
దీనిపై ఢిల్లీ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో శిల్పాశెట్టి దంపతులతో పాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎమ్కే మధ్వా, సత్యేంద్ర సరుప్రియ, ఉమేశ్ గోయాంక పేర్లున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యాపారవేత్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మన్సి మాలిక్.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించాడు. అనంతరం తదుపరి విచారణనను నవంబర్ 9కి వాయిదా వేశారు.