వికటించిన ట్రీట్‌మెంట్‌: రూ.కోటి డిమాండ్‌ చేసిన నటి

27 Apr, 2021 13:49 IST|Sakshi

అందానికి నిగారింపు కోసం వెళ్తే అందవిహీనంగా మార్చారంటూ తమిళ నటి రైజా విల్సన్‌ ఆ మధ్య సోషల్‌ మీడియాలో గోడు వెల్లబోసుకున్న విషయం తెలిసిందే. ఫేషియల్‌ చేయమంటే మరేదో చికిత్సను బలవంతంగా ట్రై చేసిందని, దీంతో తన ముఖం పాడైందని ఫొటోలు కూడా షేర్‌ చేసింది. కంటి కింద వాపు కూడా వచ్చిందని పేర్కొంది. దీనికి కారణమైన చెన్నై చర్మనిపుణులు భైరవి సెంతిల్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆమెను కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె క్లినిక్‌కు రాకుండా తప్పించుకు తిరుగుతోందని సైతం ఆరోపించింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై సదరు డాక్టర్‌ భైరవి స్పందించినట్లు సమాచారం. ఆమె అనుమతితోనే చికిత్స అందించానని పేర్కొందట. కళ్ల కింద వచ్చిన వాపు కూడా కొన్నిరోజులకే దానంతటదే తగ్గిపోతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కానీ తనేమీ బలవంతంగా ఆమెకు ఏ చికిత్సా చేయలేదని స్పష్టం చేసినట్లు వినికిడి.

అటు రైజా మాత్రం ఈ డాక్టర్‌ వల్ల తన పని కూడా ఆగిపోయిందని చెప్తోంది. ఆమె చేసిన పనికి మానసికంగానూ బాధను అనుభవించానంటోంది. ముఖం మీద వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడప్పుడే సినిమాల్లోనూ నటించలేనని అంటోంది. దీనివల్ల ఆదాయం కూడా కోల్పోతున్నానని చెప్తోంది. ఆమె నిర్లక్ష్యానికి తాను మూల్యం చెల్లించుకుంటానని వాపోయింది. తనకు జరిగిన నష్టానికి గానూ డాక్టర్‌ భైరవి నుంచి కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని తమిళనాడు మెడికల్‌ కౌన్సిల్‌తోపాటు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

A post shared by Raiza Wilson (@raizawilson)

చదవండి: ఫేషియల్‌ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్‌

మరిన్ని వార్తలు