ఆకాశంలో శివుడు.. మన కోసం వస్తున్నాడు: డీఎస్పీ

17 May, 2021 08:44 IST|Sakshi

కరోనా ఇప్పుడప్పుడే పోయేలా లేదు. ఇప్పటికే ఎంతోమందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి నానాటికీ విజృంభిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఈ మాయదారి రోగం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని పీడ ఎప్పుడు విరగడువుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్‌గా మారింది. "ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి మనల్ని గట్టెక్కించేందుకు తరలి వస్తున్నాడు" అంటూ తన కెమెరాల్లో బంధించిన ఫొటోను షేర్‌ చేశాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. ఈ ఫొటోను చూసిన జనాలు అబ్బురపడిపోతున్నారు. గరళాన్నే కంఠంలో దాచుకున్న ఆ పరమశివుడికి కరోనాను అంతం చేయడం పెద్ద కష్టం కాదని, ఆయన త్వరగా ఆ వ్యాధిని అంతం చేసి అందరినీ కాపాడతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేవుడిని పిలవగానే ప్రత్యక్షమైపోవడానికి ఇది సినిమా కాదు అంటూ వ్యంగ్యంగా సమాధానాలిస్తున్నారు. మొత్తానికి డీఎస్పీ తీసిన ఫొటో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

చదవండి: 2021ని ఇరగదీయాలని డిసైడ్‌ అయ్యాను: డీఎస్పీ

మరిన్ని వార్తలు