ధనుష్‌ ‘సార్‌’ వచ్చేస్తున్నాడు

2 Feb, 2023 10:25 IST|Sakshi

నటుడు ధనుష్‌ ఇటీవల నటించిన చిత్రం తిరుచ్చిట్రం ఫలం. నిత్యామీనన్‌ కథానాయకిగా నటించిన ఇందులో ప్రియా భవానీశంకర్, రాశీఖన్నా అతిథులుగా మెరిశారు. మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం ధనుష్‌ తమిళం, తెలుగు భాషల్లో నటించిన చిత్రం వాతి. తెలుగులో సార్‌ పేరుతో తెరకెక్కింది. సంయుక్త మీనన్‌ నాయకిగా నటించారు. దర్శకుడు సముద్రఖని, రాజేంద్రన్, సాయికుమార్, ఆడుగళం నరేన్, తణికెళ్ల భరణి, హైపర్‌ ఆది, తోటపల్లి మధు, ఇళవరసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టాలీవుడ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై మంచి హిట్‌ అయ్యాయి. దీన్ని తమిళనాడు విడుదల హక్కులను 7 స్క్రీన్‌ స్టూడియో అధినేత ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ పొందారు. ఈయన ప్రస్తుతం విజయ్‌ హీరోగా ఆయన 67వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో వాతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో ఈ నెల 4వ తేదీ భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రాన్ని 17వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఇప్పుటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు